WORLD FLAG COUNTER

Flag Counter

Saturday, 28 November 2015

FACTS OF BREAST CANCER - HOW IT EFFECTS - HOW TO TAKE PRECAUTIONARY MEASURES TO GET RID OF BREAST CANCER


సాధారణంగా ఏభై ఏళ్లు పైబడిన మహిళలే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ వ్యాధికి లోనవుతుంటారని అనుకుంటాం. కానీ, ఇటీవలి కాలంలో టీనేజీ యువతుల్లో సైతం ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన అంశాలు ఇందుకు కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. కోయంబత్తూరులో 14 ఏళ్ల బాలికలో, ఢిల్లీలో 19 ఏళ్ల యువతిలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు గుర్తించాక అందుకు కారణాలను పరిశోధకులు విశే్లషిస్తున్నారు. టీనేజీ యువతుల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కనిపించడం చాలా అరుదైనప్పటికీ, 35 ఏళ్లలోపు వయసు కలిగిన మహిళల్లో వ్యాధి తీవ్రత 3 నుంచి 8 శాతానికి పెరిగినట్లు కోయంబత్తూరులోని ఓ పరిశోధనా సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది.
యుక్తవయసు అమ్మాయిల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతోందన్న విషయాన్ని కొట్టిపారేయలేమని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) సైతం అంగీకరిస్తోంది. 20-40 ఏళ్ల వయసు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు 5 నుంచి 15 శాతానికి పెరిగినట్లు (గత ఇరవై ఏళ్ల కాలంలో) ఐసిఎంఆర్ పరిశోధకులు చెబుతున్నారు. 35 ఏళ్లు పైబడిన మహిళలు రొమ్ము క్యాన్సర్‌కు లోనయ్యే ప్రమాదం ఏర్పడిందని, తమ వద్దకు చికిత్సకు వచ్చే రోగుల్లో 40 శాతం మంది 40 ఏళ్ల లోపు వయసువారేనని కోయంబత్తూరులోని కోవై వైద్య కేంద్రం ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం- నలభై ఏళ్లలోపు మహిళల్లో పదిశాతం మందిలో మాత్రమే వ్యాధి లక్షణాలు కనిపించేవని, ఇపుడు అది 40 శాతానికి పెరగడం ఆందోళనకరమని వారు స్పష్టం చేస్తున్నారు. మారుతున్న జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పద్ధతులు సైతం గతి తప్పుతున్నాయని, ఈ కారణంగానే హోర్మోన్ల లోపం ఏర్పడుతూ వయసుతో సంబంధం లేకుండా మహిళలు రొమ్ము క్యాన్సర్‌కు గురవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఊబకాయం, పోషకాహార లోపంతో పాటు అధిక స్థాయిలో ఈస్ట్రోజన్ విడుదల కావడం వంటివి రొమ్ము క్యాన్సర్‌కు కారణాలవుతున్నాయి. గత దశాబ్దకాలంగా ఈ విపరీత పరిణామాలు మరీ ఎక్కువగా చోటుచేసుకున్నాయని పరిశోధకులు అంటున్నారు. పెళ్లిళ్లు ఆలస్యం కావడం, నడివయసులో గర్భధారణలు, శిశువులకు చనుబాలు ఇవ్వకపోవడం వంటివి కూడా రొమ్ము క్యాన్సర్‌కు పరోక్ష కారణాలుగా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ పట్ల తగినంతగా ప్రచారం, అవగాహన లేకపోవడం, పల్లె ప్రాంతాల్లో వైద్య పరీక్షలకు ఆధునిక సౌకర్యాలు లేకపోవడంతో వ్యాధిని గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా వ్యాధిని సకాలంలో గుర్తించే వీలు లేకుండా పోతోంది. వ్యాధి నిర్ధారణకు, చికిత్సకు మారుమూల ప్రాంతాల్లో సైతం ఆధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాల్సి ఉంది.

No comments:

Post a Comment