WORLD FLAG COUNTER

Flag Counter

Saturday, 28 November 2015

INFORMATION ABOUT KERALA - THIRUVANANTHAPURAM SRI ANANTHA PADMANABHA SWAMY TEMPLE IN TELUGU


శ్రీ అనంత పద్మనాభస్వామి సుప్రసిద్ధ దేవాలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో వున్నది. హిందువులకు ఆరాధ్య దైవమైన పద్మనాభస్వామి ఇక్కడ ఆదిశేషుని పానుపుగా చేసుకొని శయనించి ఉన్నందున కేరళీయులు ఈ పుణ్యక్షేత్రాన్ని ‘అనంత శయనం’ అని పిలుస్తారు. ఈ ఆలయం తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు విగ్రహప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు పండితుల విశే్లషణ ద్వారా తెలుస్తుంది.
తుళువంగ బ్రాహ్మణ ఋషియైన ‘దివాకర ముని’ సారథ్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు విశదీకరించబడింది. విష్ణ్భుక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా, శ్రీమహావిష్ణువు చిన్న బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుని ముఖవర్చసుకు తన్మయుడైన దివాకరముని తనవద్ద ఉండిపోవాలని కోరుతాడు. ఆ బాలుడు తనను ప్రేమగా చూడాలని, అలా చూడనినాడు తాను వెళ్ళిపోగలనని ఆంక్ష విధిస్తాడు. దివాకరముని అందుకు అంగీకరించి ఆ బాలుని వాత్సల్యంతో చూస్తూ, ఆనందంతో గడుపుతాడు. ఒక రోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరుగెత్తాడు. ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తంచేస్తాడు. అప్పుడు ఆ బాలుడు ముని మాట తప్పినాడని భావించి, తనకు అరణ్యంలో కనిపిస్తానని అదృశ్యవౌతాడు. ఈ సంఘటనతో ముని ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో అరణ్యానికి వెళ్ళగా ఆ బాలుడు క్షణకాలం కనిపించి, అనంతరం ఒక మహావృక్షరూపంలో నేలకొరిగి, శ్రీ మహావిష్ణువు శేషశయనుడిగా ఉన్న రూపంలో కనిపిస్తాడు. ఆ తేజోమయమూర్తి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వ్యాపించి, శిరసు ‘తిరువళ్ళం’ అన్న గ్రామంవద్ద, పాదములు ‘త్రిప్పాపూర్’ వద్ద కన్పించాయి. ఆ అనంతమైన విగ్రహాన్ని మానవులు దర్శించటం కష్టతరమని తలచి, అందరికి కనువిందుచేసే రూపంలో అవతరించాలని దివాకరముని వేడుకొన్నాడు. ఆ దివాకరముని కోరిక మేరకు ప్రస్తుత రూపంలో కన్పించగా, అట్టి విగ్రహాన్ని తిరువనంతపురంలో ప్రతిష్టించినట్లు ప్రాచీన కథ.
5వ శతాబ్దికాలంలో ‘చేరమాన్ పెరుమాళ్’ అనే రాజు ఈ ఆలయానికి తొలి పునాది వేసినట్లు, క్రీ.శ.1050వ సంవత్సరంలో ప్రాకారం నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. క్రీ.శ.1335-1384 సంవత్సర మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వీరమార్తాండవర్మ అనే రాజు ఆలయ పాలన, వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు. 1375 సంవత్సరంలో ‘అల్పిసి’ అనే ఉత్సవాన్ని ప్రవేశపెట్టినాడు.
ఆరు నెలలకొకసారి పది రోజులపాటు ఈ ఉత్సవం ఈనాటికి జరుగుతూనే ఉన్నది. క్రీ.శ.1459-60 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయం గర్భగుడి పునరుద్ధరణ జరిగింది. క్రీ.శ.1461లో ఒక రాతిపై ‘‘ఓట్టకల్ మండపం’ నిర్మాణం జరిగింది. క్రీ.శ.1729లో తిరువాన్కుర్ రాజు రాజామార్తాండవర్మ హయాంలో పలు మండపాలు పునర్మించారు.
రెండేళ్లకోసారి జరిగే ‘్భద్రదీపం’ ఉత్సవం ఈ ఆలయానికి ప్రత్యేకం. వాస్తవానికి ఇది దీపారాధన. దేశంలో భద్రదీపం అర్చన జరిగే ఆలయం ఇదొక్కటే. 12వ భద్రదీపం ఉత్సవాన్ని లక్ష దీపాలతో నిర్వహించినప్పుడు తిరువాన్కూర్ మహారాజా పద్మనాభస్వామికి ఘనంగా బంగారు, నగదు, పట్టువస్త్రాలు సమర్పించాడు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది.
ఈ ఆలయంలో గణపతి, రామ, నరసింహ, అయ్యప్ప, వేదవ్యాస, గరుడ, హనుమాన్ ఆలయాలు కూడా ఉన్నాయి. ఏడంతస్థుల రాజగోపురం ఒకబోటును పోలి ఉంటుంది. ఇక్కడి ‘కులశేఖర మండపం’ అడుగడుగునా నల్లరాతి శిల్పసంపదతో అలరారుతూ ఉంటుంది. మూల విగ్రహానికి ఎదురుగా ఉండే ‘ఒట్టక్కల్ మండపం’ ఏకశిలా నిర్మితం. 2.5 అడుగుల మందం ఇరవై అడుగుల విస్తీర్ణంతో ఒకే గ్రానైట్ రాయితో ఈ మండపాన్ని నిర్మించారు. పద్మనాభస్వామి ఆలయానికి వంద అడుగుల పొడవు కలిగిన ఏడు అంచెల గోపురం ఉంది. నిర్మాణపరంగా ఆనాటి వైభవం కళ్లకు కడుతుంది. 365 స్తంభాలు వాటిలో మూడోవంతు గ్రానైట్‌పై చెక్కినవే. వాటిపై ఉన్న చెక్కడాలు నాటి చారిత్రక పరిస్థితికి అద్దం పడతాయి. ఇలాంటి దేవాలయం ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంటాయి. పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా ఇటీవల బయలుపడిన నేల మాళిగలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తాయి. పద్మనాభస్వామి ఆలయానికి పదమూడు శతాబ్దాల చరిత్ర ఉంది. అప్పట్లో ఎనిమిదో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చేరారాజుల కాలంలో ఇది ప్రసిద్ధి చెందింది. బ్రహ్మ, విష్ణు, వాయు, వరాహ పద్మ పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది.

No comments:

Post a Comment